ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల (73) బుధవారం అర్థరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1944 ఫిబ్రవరి 20న విజయనిర్మల జన్మించారు. ఆమె తండ్రి స్వస్థలం చెన్నై, తల్లిది నరసరావుపేట.
విజయనిర్మల ఏడేళ్లకే తొలిసారి తమిళ్ సినిమా మత్సరాసలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో వచ్చిన పాండురంగ మహత్యం సినిమాలో 11 ఏళ్ల వయస్సులో కనిపించారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారి విజయనిర్మల కృష్ణుడి వేషంలో బాలనటిగా (తెలుగులో) చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత రంగులరాట్నం సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఆ మరుసటి సంవత్సరమే కృష్ణతో కలిసి సాక్షి సినిమాలో నటించారు. సాక్షి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు బాపు వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో 200పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ సహజనటి, సీనియర్ హీరోయిన్ జయసుధ వరుసకు విజయనిర్మలకు కూతురు అవుతుంది. అంటే విజయనిర్మల జయసుధకు పిన్ని అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. విజయనిర్మల కుమారుడు, ప్రముఖ నటుడు నరేష్ ప్రస్తుతం 'మా' అధ్యక్షుడుగా ఉన్నారు.