అంచనాలు పెంచిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ట్రైలర్!
తెలుగు లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రపంచ స్థాయిలో ఏ రేంజ్ లో సత్తాచూపించాయో అందరికీ తెలిసిందే. జానపద నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం దర్శకులు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడ్డ సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ చిత్రంలో ప్యూజువల్ వండర్స్ ఎంతో అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలకు దర్శక, నిర్మాతలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో భారీ బడ్జెట్ చిత్రంగా సుమారు వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక బాహుబలి స్థాయిలో ఇప్పుడు బాలీలీవుడ్ లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రాబోతుంది.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటించారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ను ఈ రోజు విడుదల చేశారు. ముంబయిలోని వడాలా ప్రాంతంలో ఉన్న ఐమ్యాక్స్ థియేటర్లో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా భారత దేశంలో బ్రిటీష్ వారి సమయంలో కొంత మంది వీరులు ఎలా ఎదిరించి పోరాడారు అన్న కాన్సెప్ట్ తో కూడుకున్నది కావడం విశేషం. ఈస్ట్ ఇండియా దొరలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చారు.
ఈ క్రమంలో భారతీయులను తమ బానిసలను చేసుకొని దౌర్జన్యాలు చేస్తుంటారు. ఈ బానిస బతుకు నచ్చని కొందరు భారతీయులు తిరగబడాలనుకున్నారు’ అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఖుదాబక్ష్ (అమితాబ్)ను చంపడానికి మరో తెలివైన హిందుస్థానీ దోపిడీదారుడిని దింపాలని బ్రిటిష్ దొరలు పథకం రచిస్తారు. ఇందుకోసం ఫిరంగి (ఆమిర్)ను దింపుతారు. కన్నింగ్ క్యారెక్టర్ పాత్రలో అమీర్ ఖాన్ యాక్షన్ నవ్వుపుట్టిస్తుంది. అమీర్ ఖాన్ పాత్ర నెగీటీవ్..పాజిటీవ్ గా కనిపిస్తుంది. చివరి సన్నివేశంలో ఆమిర్, అమితాబ్ మధ్య వచ్చే యుద్ధం సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి.
‘మోసం చేయడం నా స్వభావం’ అని అమితాబ్తో ఆమిర్ అంటాడు. ఇందుకు అమితాబ్.. ‘నమ్మకం నా స్వభావం’ అని చెప్పడం ఆకట్టుకుంటుంది. నర్తకిగా సురైయా (కత్రినా) తన అందం, డ్యాన్స్తో ఆకట్టుకుంటుంది. ఇక ఫాతిమా వీర యోధురాలిగా బాణాలు సందిస్తూ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విదేశీ డిజైనర్లు, ఓడ నిర్మాణ నిపుణుల సహకారంతో ఈ సెట్లను తీర్చిదిద్దారు.
ఏడాది పాటు సుమారు వెయ్యి మంది శ్రమించి ఈ సెట్లను సిద్ధం చేశారని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.