ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది. తెలుగు లో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అనుకున్న దానికన్నా ఎక్కువగానే రిజల్ట్ సాధించింది. ఇప్పుడు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మొదట తేజ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు తేజ తెలిపారు.
ఆ తర్వాత తెరపైకి రాఘవేంద్ర రావు, పూరి జగన్నాధ్ లాంటి వారి పేర్లు వచ్చాయి. కానీ బాలకృష్ణతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తీసిన క్రిష్ జాగర్లమూడి నే మరోసారి ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని బాలయ్య ఇటీవల అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమాకు దర్శకుడినైతే ప్రకటించారు కానీ, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం ప్రకటించలేదు. అయితే క్రిష్ సూచన మాత్రం ‘మహానటి’ పాత్రతో అందరి హృదయాలు గెల్చుకున్న నటి కీర్తి సురేష్ ని ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర లో నటిస్తే బాగుంటుందని భావించారట.
ఇందుకోసం కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు..ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది. మహానటిగా తెలుగు వారిని ఫిదా చేసిన కీర్తి సురేష్.. బసవతారకం గారి పాత్ర చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.