ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై దక్షిణాది హవా నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా సౌతిండియా నుంచి సూపర్ స్టార్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన పేరు రజనీకాంత్ మాత్రమే. ఆయనకు మాత్రమే భాషా భేదాలనధిగమించే మార్కెట్ ఉండేది. మిగతా దక్షిణాది స్టార్ హీరోల్లో కొందరికి ఇతర భాషల్లో క్రేజ్ ఉన్నా పరిమితంగానే అన్నది నిజం. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుసగా దక్షిణాది హీరోలంతా బాలీవుడ్పై దండెత్తుతున్నారు. అక్కడి మార్కెట్ ను కొల్లగొడుతున్నారు. అక్కడ కూడా స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. భారతీయ సినిమాకు దక్షిణాది సినిమా భారీ హంగులద్దుతోంది. ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఆదరణ కలిగిన స్టార్ హీరోగా మారిపోగా, ఇప్పుడు పుష్ప మూవీతో బన్నీ కూడా బాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్, చెర్రీ కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో స్టార్డమ్ సొంతం చేసుకోవడం ఖాయమేనన్న అంచనాలున్నాయి. ఆ తరువాత మహేష్ కూడా ఇదే బాటలో వెళుతున్నాడు. కన్నడ హీరో యశ్ ఒక్క సినిమాతోటే పాన్ ఇండియా స్థాయి క్రేజ్ తెచ్చుకోగా, కోలీవుడ్ హీరో దళపతి విజయ్ హీరోగా రాబోతున్న సినిమాలు కూడా ఇదే స్థాయిలో తెరకెక్కనున్నాయి.
హీరోలు మాత్రమే కాదు.. దక్షిణాది డైరెక్టర్లు కూడా ఇకపై బాలీవుడ్ను శాసించనున్నారని చెప్పాలి. రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం బాహుబలి.. భారతీయ సినిమా కమర్షియల్ స్టామీనా హాలీవుడ్ మూవీలకేమీ తీసిపోదని చాటిచెప్పింది. ప్రాంతీయ భాషా దర్శకుల క్రియేటివిటీ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అందుకే ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో అత్యధిక శాతం దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నవే. రాజమౌళి దర్శకుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలు తారక్, చెర్రీలతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం భారతీయ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అతడి దర్శకత్వంలో నటించేందుకు బాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారు. మరో భారీ బడ్జెట్ మూవీ ప్రభాస్ కథానాయకుడిగా ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్ధమైన రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణకుమార్ కూడా తెలుగువాడే. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్నీల్ కేజీఎఫ్ మూవీ తరువాత భారీ సినిమాలే చేయబోతుండగా, రాజారాణి, తెరి, మెర్సల్, బిగిల్ వంటి సూపర్ హిట్ మూవీలు తెరకెక్కించిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా వీరి లిస్టులో చేరిపోయాడు. ఇతడు షారుక్ఖాన్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. శంకర్, మురుగదాస్ ఇప్పటికే ఈ విషయంలో వీరికంటే ముందున్న విషయం తెలిసిందే. వీరిని చూస్తుంటే ఇకపై భారతీయ సిల్వర్స్క్రీన్ను ఏలేది దక్షిణాది వారేనని ఎవరికైనా అనిపించకుండా ఉంటుందా..!