బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

Edari Rama Krishna
‘కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం’ అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో ‘తిలకమ్’ అని, తెలుగులో ‘బొట్టు’ అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికీ కేంద్ర స్థానం లలాట భ్రూమధ్యభాగం, అంటే కనుబొమల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారవౌతాయి.

ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తరమైన శక్తి, కుంకుమ, విభూతి, గంధం, కస్తూరి, చందనం వంటి పదార్థాలకు ఉంది. ఇవి దృష్టి దోషాలను కూడా నివారిస్తాయి. అందుకే మహర్షుల బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకు సంప్రదాయంగా మారింది. కంకుమలో పసుపు ఉంటుంది. రెండు గుణాలు కలిగిన ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. గంధం జ్ఞానానికి సంకేతం.యోగశాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమల మధ్యన ఆజ్ఞాచక్రం ఉండే చోట మనం పెట్టుకునే కుంకుమ వేలి ఒత్తిడివలన ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది.


  నొసటిమీద ఎర్రని కుంకుమ బొట్టు ముతె్తైదువతనాన్ని సూచిస్తుంది. మనస్తత్వ శాస్తర్రీత్యా ఎర్రని కుంకుమ ఒక ప్రత్యేకమైన వర్గ ఫలం కలిగి ఉంది. నొసటిమీద కుంకుమ పెట్టుకోవడం మన భారతీయుల ప్రాచీన సంప్రదాయం. బొట్టు ధరించడం మగవారికీ అవసరమే.భగవంతుడు సంచరించే షుఘుమ్ననాడి ఎక్కడ రెండు కనుబొమల మధ్య వుంటుందో అక్కడ ఆజ్ఞాచక్రస్థానంలో కుంకుమ ధరించడం వలన భగవంతుని స్మరించిన వారవౌతాము. ముఖానికి ఆభరణం తిలకం.

పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్ర్తిలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ ‘ఊర్థ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్’ అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే అంత్యప్రాసల కవి ఆరుద్ర ‘నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు’’ అన్నాడు. జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలను ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. నాగరికత ముసుగులో ఈనాడు యువత కుంకుమ బొట్టుకు దూరవౌతూ ప్లాస్టిక్ స్టిక్కర్లకు దగ్గరౌతోంది. ఈ ప్లాస్టిక్ స్టిక్కర్ల వలన రకరకాల చర్మవ్యాధులకు గురి అవుతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని ఆచారాలను, వాటి వెనుక ఉండే వైజ్ఞానిక విషయాలను నేటి యువతులు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో వుంది.కుంకుమబొట్టు మేధస్సును పెంచి వృద్ధిపరచే సాధనంగా మన పూర్వీకులు భావించారు. ఈ కుంకుమ బొట్టు స్ర్తిల ముఖారవింద ఆకర్షణతోపాటు ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నట్లు, హిందూ స్ర్తి నుదుటి బొట్టు లేకపోవడం ముఖం కళావిహీనంగా అగుపిస్తుంటుంది. ప్రాచీన కాలంనుండి ఆచారంగా వస్తోన్నది.

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలవౌతాయని, మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరించేవారు. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: