సేంద్రియ వ్యవసాయంలో.. రైతుల ప్రదర్శన..!
తిండి కోసం ఖర్చు చేయడానికి ఆలోచిస్తే, వైద్యం ఖర్చు పెరిగిపోతుంది అని నిపుణులు అంటున్నారు. అయితే కనీస సౌకర్యాలు కూడా ఇంకాఅందని వారు దేశంలో చాలా మంది ఉన్నారు. వారందరికి ప్రభుత్వం అనేక పధకాల ద్వారా ఆయా ఫలాలను ఇస్తున్నప్పటికీ, అవి పండించేది కూడా పస లేని విధానంలోనే కావడంతో ఏదో ఆకలికి ఇంత తినాలి అనేదే తృప్తి చెందుతుంది తప్ప పౌష్టికాహారం మాత్రం అందటం లేదు. అందుకే ఇటీవల కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హరిత విప్లవం ద్వారా వచ్చిన వంగడాలు కాకుండా, గతంలో పెద్దలు చూపిన దారిలో ఈ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దానితో మంచి వంగడాలను రూపొందిస్తు, అవి ఇతర రైతులకు కూడా అందిస్తున్నారు. ఆయా వంగడాలతో పండించిన ఆహారం తినడం వలన సహజంగా భారతీయ వాతావరణంలో ఉండే వారికి కావాల్సిన ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే ఇన్నాళ్లు తిన్న పసలేని ఆహారం వలన శరీరంలో పేరుకునిపోయిన కొన్ని లోపాలు కూడా నెమ్మదిగా ఈ ఆహారం తీసుకోవడం వలన తగ్గిపోతున్నట్టు కూడా వీళ్లు ఆయా వినియోగదారుల నుండి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
అయితే ఈ సేంద్రియ రైతులు పండించే విధానం ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలని, పెద్దల వ్యవసాయ పద్ధతులు తిరిగి అందరు రైతులు ఆచరించాలనే ఉద్దేశ్యంతో వారివారి వ్యవసాయ భూములలో వంగడాలతోనే అనేక రూపాలు వచ్చే విధంగా విత్తనాలను నాటి, వారి ప్రత్యేకతను ఆయా సామజిక మాద్యమాలద్వారా అందరికి తెలియజేయడంలో సఫలీకృతులు అవుతున్నారు. తాజాగా దసరా సందర్భంగా ఒక రైతు దుర్గమ్మ రూపాన్ని వంగడాలతో చక్కగా రూపొందించారు. ఇది గుంటూరుకు చెందిన కొల్లిపర మండలం అత్తోటకు చెందిన రైతు బాపారావు తన వ్యవసాయ భూమిలో వేద పద్దతిలో ఏర్పాటు చేశారు. విత్తనం నాటిన రెండు నెలల తరువాత ఈ ఫలితం కనిపించి, అందరిని ఆకట్టుకుంటుంది.