బుడుగు: ఎండాకాలం వచ్చేసింది.. పిల్లలకు దద్దుర్లు వస్తాయ్ జాగ్రత్త..!
చిన్న పిల్లలకు చెమట అనేది చేతులు, మెడ, కాళ్ల మడతలు తదితర ప్రాంతాల్లో అవుతాయి. వీటితో ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు తల్లులు సాధారణంగా బేబీ పౌడర్లు రాస్తుంటారు. అయితే అలా చేస్తే పిల్లాడికి ప్రమాదం అవుతుందని, శరీరంలోని చెమట బయటకు పోవడానికి దారులు మూసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పౌడర్ రాయడంతో చర్మంలోని చల్లదనం పోతుందని, దీంతో శరీరం ఎర్రగా మారి నీటి కురుపులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఎండాకాలంలో పిల్లలకు పౌడర్లు రాయడం వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు.
జూలై నెల వరకు ఎండాకాలం కొనసాగుతుంది. అప్పటివరకు పిల్లలకు తేలికగా ఉండే బట్టలు, వదులుగా గాలి తగిలే బట్టలను తొడగించాలి. కాటన్ దుస్తులు అస్సలు వాడవద్దు. డైపర్లు కూడా ఎక్కువ సేపు ఉంచకూడదు.. వీలైనంత వరకు మార్చేస్తుంటూ ఉండాలి. లేకపోతే ఆ ప్రాంతంలో ర్యాషెస్ ఏర్పడి మంట పెడతాయి. పిల్లలకు ఉదయం, సాయంత్రం పూట స్నానం చేయిస్తుంటారు. చల్లగా అనిపిస్తుందని బిగుతైన బట్టలు తొడిగేస్తుంటారు తల్లులు. దీంతో శరీరానికి గాలి ఆడక.. చెమట పట్టి ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. చెమట అనేది పిల్లలకు మంచిది. చెమట పడుతుందని ఫ్యాన్, ఏసీలు నిలిపివేయరాదు. వేడిగా అనిపించినప్పుడు తల్లులే తడిగుడ్డతో పిల్లల శరీరంపై అద్దుతూ ఉండాలి.
చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారిపై దుప్పట్లు, గాలి ఆడకుండా కప్పుతుంటారు. అలా చేస్తే పిల్లల శరీరానికి గాలి తగలదు. ఫలితంగా దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోజూ వారి ఆహారంలో పాలు, పుచ్చకాయలు, కర్బూజాలు, బొండాలు, బొప్పాయి వంటి నీరు బాగా ఉండే ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు పిల్లాడి శరీరానికి తగిన చల్లదన్నాన్ని చేకూరుస్తాయి. ఎండాకాలంలో పిల్లలను బయటకు తీసుకెళ్లడం తగ్గించాలి. వీలైనంత వరకు సాయంత్రం వేళ్లల్లో తీసుకెళ్లాలి.