బుడుగు: పిల్లలు ఎక్కువగా శానిటైజర్‌ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ.!?

N.ANJI
కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు శానిటైజర్‌లు అంటే పెద్దగా ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఆరోగ్య రంగంలో పనిచేసే వారు, డాక్టర్లు, నర్సులు లాంటి వారు మాత్రమే ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు. ఇక కరోనా వైరస్ దేశంలో అడుగు పెట్టిన దగ్గర నుండి అందరు శానిటైజర్లు వాడుతున్నారు. ఇక మీ పిల్లలు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త సుమీ. వాటిని వాడే పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ పాయిజన్‌ కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి మానవ జీవితంలోకి ప్రవేశించిందో శానిటైజర్‌లేని ప్రదేశాలను భూతద్దంలో పెట్టి వెతికినా దొరకట్లేవు. షాపింగ్‌ మాళ్లు, థియేటర్లు, ఆఫీసులు, స్కూళ్లు ఇలా ఎక్కడ చూసినా శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. ప్రజలు కూడా వీటి వినియోగాన్ని బాగా పెంచారు. ఈ క్రమంలోనే చిన్నారులు కూడా శానిటైజర్లను ఉపయోగించేస్తున్నారు. అయితే దీని ద్వారా చిన్నారుల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఇక శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న పిల్లల్లో కళ్లు దెబ్బతింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేతులకు శానిటైజర్‌ రాసుకున్న తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే కళ్లు తుడుచుకుంటున్నారని, దీనివల్ల కళ్లపైప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 24 మధ్య పిల్లల కళ్లు దెబ్బతిన్న కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగడం గమనార్హం. శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్‌తో పాటు ఇతర ప్రమాదాకర రసాయనాలు పిల్లల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ తరహా నేత్ర సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న పిల్లల సంఖ్య అంతక్రితం ఏడాదితో పోలిస్తే.. 2020 సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 24 మధ్యకాలంలో ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 2019 సంవత్సరంలో పిల్లల కంటి సమస్యల్లో 1.3 శాతం కేసులే హ్యాండ్‌ శానిటైజర్‌తో ముడిపడినవి కాగా, 2020 సంవత్సరంలో అవి ఒక్కసారిగా 9.9 శాతానికి పెరిగాయన్నారు. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు శానిటైజర్లకు దూరంగా ఉంచుతూ సబ్బుతో చేతులను కడుక్కునే అలవాటు నేర్పించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: