పిల్లల్లో ఒమిక్రాన్ డేంజర్.. ఆ జబ్బు వస్తోందట?
అయితే.. కరోనా ఒమిక్రాన్ వచ్చిపోయిన వారిలో ప్రత్యేకించి పిల్లల్లో క్రూప్ అనే శ్వాసకోశ వ్యాధి వస్తున్నట్లు బోస్టర్ పరిశోధకులు గుర్తించారు. అక్కడి పిల్లల వైద్యశాల జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం గుర్తించారట. ఈ వ్యాధి బారినపడిన బాలలు బాగా దగ్గుతూ ఉంటారు. ఎంతగా అంటే ఒక్కోసారి ఊపిరాడక ఆ పిల్లలు బలంగా శ్వాస తీసుకోవలసిన పరిస్థితి వస్తుంటుంది. ఒమిక్రాన్ వైరస్ శ్వాస కోశంలో ఎగువ భాగానికి సోకుతుందని ఇప్పటికే జంతువులపై జరిగిన పరిశోధనల్లో తేలింది కదా.
ఈ ఒమిక్రాన్ బారిన పడిన పిల్లల్లోనూ ఈ క్రూప్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. చాలా మంది పిల్లలకు ఈ క్రూప్ కొవిడ్ 19తోనే వస్తోందట. అయితే ఊరట ఏంటంటే.. అలా క్రూప్ వచ్చిన వారిలో ఏ ఒక్కరూ మరణించలేదట. కాకపోతే దీని తీవ్రత మాత్రం బాగానే ఉంటోంది. క్రూప్ వచ్చిన పిల్లల్లో 9 మంది ఆస్పత్రిలో చేరవలసి వస్తే.. వారిలో నలుగురు ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చిందట.
ఇక నూటికి 97 శాతం మందికి డెక్సామిథేసోన్ మందుతో చికిత్స చేసి నయం చేశారట. ఈ క్రూప్ వ్యాధితో ఆస్పత్రి చేరికలు కూడా ఎక్కువగానే ఉన్నాయట. మిగిలిన కరోనా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ కారణంగా పిల్లల్లో ఈ క్రూప్ వచ్చే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉందట. అందుకే మీ పిల్లలకు ఇప్పటికే ఒమిక్రాన్ బారిన పడి ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితిని గమనించండి. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే మాత్రం డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స అందించండి.