అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ & రేటింగ్!

Reddy P Rajasekhar
తెలుగు సినీ ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్ జానర్ అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్‌లో సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, వెన్నులో వణుకు పుట్టించే సీన్లు ఉంటే మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పటికే ఈ జానర్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించాయి.  వైవిధ్యమైన కంటెంట్‌తో నేడు బాక్సాఫీస్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’. ఎన్నో సినిమాల పోటీ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

కథ :

ఈశ్వర్ (శివ కంఠమనేని) అనే సస్పెండెడ్ సీఐ భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ) కాగా, ఆమె సోదరీమణులు భార్గవి (సుప్రిత), విజ్జులతో కలిసి వారి సంసారం సాగుతుంటుంది. సెలబ్రిటీ కావాలనే బలమైన కోరికతో భార్గవి ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతూ, దెయ్యాలతో గడిపే వినూత్న కాన్సెప్ట్‌తో వీడియోలు తీస్తుంటుంది. ఈ క్రమంలో పాతబస్తీలోని ఒక పాత భవంతిలో ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా పాపులారిటీ వస్తుంది. అదే సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ రావడమే కాకుండా, దెయ్యాల ఉనికిని లైవ్‌లో నిరూపిస్తానని చెప్పడంతో ఆసక్తి పెంచుకున్న భార్గవి తన కుటుంబంతో కలిసి అమరావతి గ్రామానికి ప్రయాణమవుతుంది. అక్కడ ఈశ్వర్ కుటుంబానికి ఎదురైన ఊహించని వింత పరిణామాలు ఏమిటి, జమీందారీ వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్ నోరోన్హా) మరణం వెనుక ఉన్న రహస్యమేమిటి, రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఈశ్వర్ సస్పెన్షన్‌కు దారితీసిన పరిస్థితులు ఏమిటనే ఉత్కంఠభరిత అంశాలను తెరపైనే చూడాలి.

విశ్లేషణ :

దెయ్యాలు ఉన్నాయా లేదా అనే సందేహాల చుట్టూ ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. మెజారిటీ హారర్ చిత్రాల్లో క్షుద్రపూజలు, ఆత్మల అంశాలే ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ‘అమరావతికి ఆహ్వానం’ సినిమాలో ఈ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక మంచి సందేశాన్ని దర్శకుడు మేళవించిన తీరు ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. టైటిల్‌లో అమరావతి ఉండటంతో ఇది పొలిటికల్ మూవీ అని భావించే అవకాశం ఉంది, కానీ మేకర్స్ ముందే చెప్పినట్లుగా ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు. ఇది పూర్తిగా ఒక పక్కా హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా.

కథ అమరావతి గ్రామంలో రాత్రివేళ జరిగే ఒక భయంకరమైన హారర్ సీన్‌తో ఆరంభమై, ఆపై హైదరాబాద్‌కు మారుతుంది. భార్గవి వీడియో షూటింగ్స్, మహేశ్‌తో ఆమె ప్రేమాయణం, ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లడం వంటి సన్నివేశాలతో కథనం సాగుతుంది. అక్కడ రాజేశ్వరి గురించిన నిజాన్ని తెలుసుకోవడంతో తొలి భాగం ముగుస్తుంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సెకండాఫ్‌లో రాజేశ్వరి పాత్ర నేపథ్యం, ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేయడమే కాకుండా, హారర్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి.

సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉండటం కొంత మైనస్ అయినప్పటికీ, దర్శకుడు కమర్షియల్ అంశాలను బాగానే మేనేజ్ చేశారు. సాధారణంగా హారర్ సినిమాల్లో పాటలు కథా గమనానికి అడ్డుగా అనిపిస్తాయి, కానీ ఇందులో సెకండాఫ్‌లో వచ్చే 'డుం డుం డియ్యాల' సాంగ్‌లో ముగ్గురు హీరోయిన్లతో డ్యాన్స్ చేయించడం సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. క్లైమాక్స్‌ను కూడా కథకు తగ్గట్టుగానే దర్శకుడు జీవీకే చక్కగా డిజైన్ చేశారు.

నటీనటులు సాంకేతిక విభాగం పనితీరు:

ఈశ్వర్‌, జ‌గ‌దీష్‌ అనే పాత్రల్లో  శివ కంఠంనేని తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లోనూ, విలన్‌గా జగదీష్‌ పాత్రలోనూ ఆయన ప్రదర్శించిన నటన మెప్పిస్తుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఏస్తేర్‌. రాజేశ్వరి పాత్రలో ఆమె అద్భుతంగా నటించడమే కాకుండా, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచారు. సినిమా ఆద్యంతం సాగే భానుమతి పాత్రలో ధన్య బాలకృష్ణ తన నటనతో ఆకట్టుకోగా, హారర్‌ సీన్స్‌లోనూ ఆమె నటన బాగుంది. భార్గవి పాత్రలో సుప్రిత తొలి సినిమాతోనే అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించి ఆకట్టుకోగా, మహేశ్‌ పాత్రలో హరీష్ నటన కూడా బాగుంది.

డాక్టర్‌ అమ్మి రాజు పాత్రలో జెమినీ సురేష్, లాయర్‌ కామేష్‌గా భద్రమ్‌ తమదైన శైలిలో మెప్పించారు. జమీందారు రాజుగా అశోక్‌ కుమార్, కాలగా నాగేంద్రలు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్,  థ్రిల్లింగ్ అంశాలను కథలో సరైన నిష్పత్తిలో కలపడంలో దర్శకుడు జీవీకే విజయవంతమయ్యారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. 'ప్రేమ క‌థా చిత్ర‌మ్' త‌ర్వాత డిఓపి ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుంది. ఆయన కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.

పద్మనాభ్‌ భరద్వాజ్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు. ఒకవైపు హారర్ మూడ్‌ను క్యారీ చేస్తూనే, పాటలతో రీఫ్రెష్‌మెంట్‌ ఇచ్చారు. క్లైమాక్స్‌లో ఆయన అందించిన ఆర్‌ఆర్ ఆకట్టుకుంటుంది. లైట్ హౌస్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండగా, హ‌నుమాన్ ఫేమ్ సాయి బాబా త‌లారి ఎడిటింగ్ సినిమాకు మరో అస్సెట్ గా నిలిచింది. హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'అమరావతికి ఆహ్వానం 2'ని ప్రకటించి మేకర్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేశారు.

రేటింగ్ : 2.75/5.0


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: