సిక్కోలులో కోరలు చాచిన కాలుష్యం- ప్రమాదంలో ప్రజానీకం
పైడిభీమవరం ప్రాంతంలో ఏర్పాటు అయిన అనేక పరిశ్రమలకు స్థానికులు భూములను త్యాగం చేశారు. స్ధానికులకు ఉపాధి కల్పించటంతో పాటు గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాలు ఇచ్చిన హామీల కారణంగా ప్రజలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు అంగీకరించారు. కానీ ప్రస్తుతం లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యాలు.. స్థానికుల బాధలు, ఇబ్బందులను కనీసం పట్టించుకోవటం లేదు. ప్రమాదాల మాట అటుంచితే.. స్దానికులకు ఇక్కడ ఉపాధి దొరకటం లేదు. ఫ్యాక్టరీల కోసం వేలాది ఎకరాలను త్యాగం చేసిన పరిసర గ్రామాల వారు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీనికితోడు గ్రామలకు దగ్గర్లో భారీగా బోర్లు వేయించి భూగర్భ జలాలను ఫ్యాక్టరీ అవసరాలకు తరలిస్తున్నారు. దీంతో వేసవి కాలంలో ఇక్కడి ప్రజలకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఇక కాలుష్యం కారణంగా పంటలు దిగుబడి తగ్గటంతో పాటు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు వ్యర్ధాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం స్మశానంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి సిక్కులులో కోరలు చాచిన కాలుష్యం నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.