ఎండలు ముదురుతున్నాయి.. మజ్జిగతో ఎంత మేలో తెలుసా..?
అలాగే మజ్జిగకు చాలా పురాణ చరిత్ర కూడా ఉందండోయ్. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట. అందుకే వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. ఫ్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.
చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది. వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ప్రత్యేకించి వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగాలి. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది వాటిని కలపండి. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి.
ఈ కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది.