ఐటీ సర్వీసెస్ హబ్గా మారేందుకు వైజాగ్ కి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా కూడా నిలిచిందని జగన్ గుర్తు చేశారు.ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని ఆయన తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని సీఎం చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు.అలాగే ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు ఇంకా ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా సీఎం ప్రారంభించారు.వైజాగ్ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు ఇంకా చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లాంటి మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో వైజాగ్ లో ఏర్పాటు కాలేదు. నిజానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్లోనే ఏర్పాటయ్యాయి.