`టీజేపీ` క‌విత పార్టీపై క‌స‌ర‌త్తులు మొద‌లు...?

RAMAKRISHNA S.S.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత, ప్రస్తుతం తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, గతంలో కొత్త రాజకీయ పార్టీ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆమె, ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టారని తెలిసింది. గతంలో, కేసీఆర్ స్థాపించిన 'తెలంగాణ రాష్ట్ర సమితి' (టీఆర్‌ఎస్) రాష్ట్ర పేరును పార్టీ పేరులో చేర్చడం ద్వారా ప్రజలకు బాగా చేరువై విజయం సాధించింది. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చాక, 'టీ' తీసేసి 'భారత్ రాష్ట్ర సమితి' (బీఆర్‌ఎస్)గా మార్చారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావించినా .. అప్పటి నుంచి పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.


ఇక, ఆ తర్వాత 'తెలంగాణ' పేరుతో వచ్చిన కొత్త పార్టీలు పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ( టీజేఎస్ ) సైతం గ్రామీణ ప్రాంతాలకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో, రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా ఒక బలమైన పార్టీ లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో, కవిత చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ అస్తిత్వాన్ని తన పార్టీలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న 'తెలంగాణ జాగృతి' సంస్థనే రాజకీయ పార్టీగా మార్చేందుకు సిద్ధమయ్యారని వినికిడి.


దాదాపుగా కొత్త పార్టీ పేరును  తెలంగాణ జాగృతి పార్టీ' (టీజేపీ) గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ పేరుకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు 'జన జాగృతి' పేరుతో ప్రజలను కలుస్తూనే, వచ్చే ఆరు మాసాల్లో పార్టీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయించేందుకు ఆమె కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే ఈ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కవిత ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా, కవిత పక్కా ప్రణాళికతోనే రాజకీయాల్లో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: