ఎన్టీఆర్ చేసిన ద్రోహం మరవం.. జగన్ మేలు మరవం.. ఫ్యాన్కే ఓటంటున్న బ్రాహ్మణ వర్గం?
ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు గతంలో మాదిరిగా ఒన్ సైడెడ్ గా ఉండే పరిస్థితి లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో టగ్ ఆఫ్ వార్ నెలకొంటుందని పలువురు విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వర్గాల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు. అయితే సీఎం జగన్ కు అంతకంతకూ ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఒక్కో సామాజిక వర్గం ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేస్తున్నాయి.
తాజాగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవి కుమార్ వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ పాలనలో బ్రాహ్మణులు తీవ్ర అణచివేతకు గురయ్యారని.. కరణం వ్యవస్థను కనుమరుగు చేసి బ్రాహ్మణుల పొట్టగొట్టింది టీడీపీనే అని విమర్శించారు. అంతేకాక వారిని అర్చకత్వానికి కూడా దూరం చేశారని ధ్వజమెత్తారు. ఏలూరులో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ బ్రాహ్మణులకు అన్ని విధాలా ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా పనిచేసిన 14 ఏళ్లలో ఏనాడైనా ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. అర్చకుల చిరకాల స్వప్నం అయిన వంశ పారంపర్య అర్చకత్వం హక్కును జగనే కల్పించారని గుర్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి బ్రాహ్మణుల్లోచైతన్యం తీసుకువస్తామన్నారు. క్రిష్టియన్ అయిన జగన్ కు బ్రాహ్మణ సంఘాలు మద్దతు ఇవ్వడమే ఇక్కడ కొసమెరుపు.