జగన్: ఆ ఒక్కడిపై.. పార్టీని సైతం బలిపెట్టేంత ప్రేమా?
ఇదేమాట జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అంటోంది. వైఎస్ సునీతకు మద్దతు ఇస్తోంది. అయితే.. సీఎం జగన్ మాత్రం తన సోదరుడు అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెబుతున్నారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. జగన్ మాత్రం అవినాష్ రెడ్డికే మద్దతు ఇస్తున్నారు. సాక్షాత్తూ సీబీఐ చెబుతున్నా.. సొంత కుటుంబ సభ్యులు చెబుతున్నా.. విపక్షం దుమ్మెత్తి పోస్తున్నా జగన్ మాత్రం అవినాష్ రెడ్డినే వెనకేసుకు వస్తున్నారు. ఇప్పుడే కాదు.. మొదటి నుంచే అంతే.
ఇక్కడ ఓ విషయం గమనించాలి.. అవినాష్ రెడ్డి దోషో, నిర్దోషో మనకు తెలియదు. కానీ.. ఆరోపణలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాస్త ఆలోచించాలి. ఆరోపణలు తప్పో ఒప్పో తేలేవరకూ కాస్త పదవులకు దూరం పెట్టాలి. అది జగన్ చేయలేదు.. సరికదా.. మళ్లీ కడప ఎంపీ టిక్కెట్ అవినాష్ రెడ్డికే ఇచ్చాడు. ఇది వైసీపీ శ్రేణులను కూడా నివ్వెరపరుస్తోంది.
సొంత కుటుంబం నుంచే ఆరోపణలు వస్తున్నా.. సొంత చెల్లెళ్లే జగన్ పై దుమ్మెత్తి పోస్తున్నా.. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా.. జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని వదలట్లేదు.. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతాయి. సొంత అన్నపై సొంత చెల్లెళ్లు చేస్తున్న రక్త పోరాటం అంత చిన్న విషయం కాదు.. తేడా వస్తే ఫలితాలే మారిపోతాయి. ఓవైపు కూటమి అంతా ఏకమై పోరాటం చేస్తున్న సమయంలో ఒక్క అవినాష్ రెడ్డిని పక్కకు పెడితే జగన్కు పోయేదేమీ లేదు. కానీ.. జగన్ మాత్రం ఎంత రిస్క్ అయినా సరే అవినాష్ను మాత్రం వదలట్లేదు. మరి జగన్కు అవినాష్పై ఎందుకంత ప్రేమ అన్న ప్రశ్న భేతాళ ప్రశ్నలా మారింది. ఇది ఎక్కడ తమ కొంప ముంచుతుందో అన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.