ఆ ఛానల్కు కోట్లు కుమ్మరిస్తున్న జగన్?
ఏపీ సీఎం జగన్ సొంత ప్రచారం కోసం ఇండియా టుడే ఛానల్కు భారీగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. విద్యా కార్యక్రమాల ప్రచారం పేరుతో పిల్లల ఫీజుల డబ్బులు రూ.4.20 కోట్లు ఇవ్వబోతున్నారు. ‘ఇండియా టుడే’ ఛానల్ తిరుపతిలో మంగళ, బుధవారాల్లో ‘ఎడ్యుకేషన్ కాంక్లేవ్’లో నాలుగు ప్యానెల్ చర్చల కోసం రూ.4.20 కోట్లు చెల్లించబోతోంది. అంతే కాదు.. ఈ సొమ్ములు సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఇంటర్మీడియట్, ఉన్నత విద్యామండళ్ల నిధుల నుంచి చెల్లించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అంటే విద్యానిధులతో జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని గతేడాది నవంబరు 21, 22న నిర్వహించాలని మొదట్లో ప్రభుత్వం నిర్ణయించినా ఆ తరవాత సమయం మార్చారు. సీఎం జగన్కు ఈ సమయం సర్దుబాటు కావడం లేదన్న కారణంతో ఇప్పుడు సాధారణ ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుపతిలో రెండు రోజులపాటు జరిగే‘ఇండియా టుడే- ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో రెండో రోజు బుధవారం జరిగే ప్యానల్ చర్చలో సీఎం జగన్ పాల్గొంటారు.
నాలుగున్నర కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం ఏమీ కాదు.. పోనీ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జరిగే మేలు ఏమైనా ఉంటుందా అంటే అదీ చెప్పలేం. విద్యార్థులకు జరిగే మేలు సంగతి పక్కకు పెడితే తమ ప్రభుత్వం విద్యారంగంలో చేసిన కృషిని చెప్పుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తోంది. చేసింది చెప్పుకోవడం కూడా ముఖ్యమే కదా అంటున్నా వైసీపీ వర్గాలు.