ఏంటిది ఆఫీసర్స్.. అధికారులపై జగన్ చిందులు?
సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్ సమీక్ష సందర్భంగా జగన్ ఈ ఘాటు కామెంట్లు చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ప్రయత్నాలు చేయలేదని సీఎం జగన్ అన్నారు. ఎస్డీజీకు సంబంధించి మనం ఇంత బాగా చేస్తున్నా వాటిని సరిగ్గా రిపోర్టింగ్ చేయలేదని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిపోర్టింగ్ మానిటరింగ్ సక్రమంగా జరగకపోతే.. ఎంత బాగా పనిచేసినా లాభం ఉండదని సీఎం జగన్ అన్నారు.
ప్రభుత్వం.. క్యాలెండర్ ప్రకారం మిస్ కాకుండా.. ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే చెప్పి మరీ ఖాతాల్లో డబ్బులు వేస్తోంది కదా అని జగన్ అధికారులను ప్రశ్నించారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్ మోడ్లో ఈ పథకాలు అందిస్తుంటే మన ర్యాంకు ఎందుకు మెరుగుపడటం లేదని సీఎం జగన్ నిలదీశారు. ఇకపై జిల్లాల్లో కలెక్టర్లు ఎస్డీజీ రిపోర్టును మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు.
ఈ రిపోర్టింగ్కు విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరమన్న జగన్.. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియగా చెప్పారు. ప్రతి నెలా ఎస్డీజీ రిపోర్టును కలెక్టర్ పర్యవేక్షణ చేయాలని హుకుం జారీ చేశారు. ప్రతిరంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్ వేయగల పథకాలు ఏపీలో ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. అమ్మఒడి, టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్లను సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదని సీఎం జగన్ మండిపడ్డారు.