ఇక స్కూళ్లలో పాఠ్యాంశంగా భగవద్గీత?

భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంధం.. మహా భారత యుద్ధ సమయంలో యుద్ధం చేయలేనంటూ అర్జునుడు ఆయుధాలు వదిలేసిన సమయంలో శ్రీకృష్ణుడు అతనికి బోధ చేసి.. మళ్లీ యుద్ధానికి ఉద్యుక్తుడిని చేస్తాడు. అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినదే ఈ భగవద్గీత.. అయితే ఇది ఇప్పటి వరకూ ఓ మత గ్రంధంగానే ఉంటూ వచ్చింది. మహాభారతాన్ని మొదట వేదవ్యాసుడు సంస్కృతంలో రాశాడు.. ఆ తర్వాత దాన్ని అనేక మంది కవులు మళ్లీ భారతీయ భాషల్లోకి అనువాదం చేసుకున్నారు.

అలా వివిధ భాషల్లోకి అనువాదం అయిన మహా భారతం, భగవద్గీత.. ఇప్పటికే భాషా పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా వచ్చి ఉండొచ్చు.. కానీ భగవద్గీతనే ఓ పాఠ్యాంశంగా ఇప్పుడు ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇంతకీ ఈ సాహసం చేస్తున్న రాష్ట్రం ఏమై ఉంటుందో ఊహించుకోండి.. మీరు ఊహించింది కరెక్టే.. అదే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ భగవద్గీతను ఓ పాఠ్యాంశంగా తప్పకుండా 6 నుంచి 12 వ తరగతి వరకూ బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6, 7,8 తరగతుల్లో భగవద్గీతను పద్యాలు, శ్లోకాల రూపంలో బోధిస్తారు.

ఇక 9 నుంచి 12 వ తరగతి వరకూ భగవద్గీతను సెకండ్ లాంగ్వేజ్‌ కింద బోధిస్తారని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు.. ఉన్నత వ్యక్తిత్వం అలవడేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. భగవద్గీత వంటి అంశాలను విద్యార్థులకు బోధించడాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు.. కానీ.. అదే తరహాలో ఇతర మతాల మత గ్రంధాలను కూడా బోధించాలని పట్టుబడితే అప్పుడు ఏంటి పరిస్థితి అన్నది కూడా ఆలోచించాలి.

ఇండియా సెక్యులర్ దేశం అని చెప్పుకుంటాం.. పని గట్టుకుని ఓ మతాన్ని ప్రోత్సహించడం, మరో మతాన్ని కించపరచడం అంటూ ప్రభుత్వం ద్వారా జరగకూడదని రాజ్యాంగం చెబుతోంది. మరి గుజరాత్ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే చిక్కులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: