ఎవరికీ పట్టని.. ఓ అమ్మాయి ఆత్మహత్య?

Chakravarthi Kalyan
"నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే.. ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ వారే దానికి పాల్పడుతుంటే ఇంకా ఎవరికీ చెప్పగలం. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నాలాగే చాలామంది అమ్మాయిలు ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మా ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో మాలో ఎవరో ఒకరు చనిపోతేనే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలుస్తుంది. అందుకే ఆ పని చేస్తున్నా నాన్నా.. నీకు ఒక మంచి కూతురిని కాలేకపోయాను.. క్షమించు" అంటూ ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు లేఖ రాసి చనిపోయిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

విశాఖ మధురవాడ సమీపంలో ఉన్న ఓ విద్యాసంస్థలో ఇటీవల లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పీఎంపాలెం సీ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లమో ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

మృతురాలి తండ్రి అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహ జరగ్గా చిన్నమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతోంది. అమ్మా నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కా బావకు అభినందనలు. అక్కా.. పండంటి బిడ్డకు జన్మనివ్వు.  చెల్లీ నీ ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టు. అంటూ విద్యార్థిని పెట్టిన చివరి మెసేజ్ చూపి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతం అవుతున్నారు. మరోవైపు దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒక విద్యార్థి తాను చనిపోతేనే ఇక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలుస్తాయి అని ఆత్మహత్య చేసుకుందంటే.. ఆ కళాశాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థంచేసుకోవాలని పేర్కొంటున్నారు. కానీ దీనిపై మహిళా కమిషన్ కానీ.. ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం దారుణమని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: