కాలుజారినా తీసుకోవచ్చుకానీ... నోరుజారితే తీసుకోవడం కష్టం??
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది అలీబాబా గ్రూప్ పరిస్థితి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా ఏ ముహూర్తాన నోరుజారారో గానీ.. అప్పటి నుంచి ఆయనను, ఆయన కంపెనీని కష్టాలు చుట్టుముట్టాయి. గతేడాది అక్టోబరు 24న చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని జాక్ మా హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ చైనా అగ్రనాయకత్వం ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, 37 బిలియన్ డాలర్లు విలువచేసే యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకొంది.
ఐపీవోకు అడ్డుకట్ట
జాక్మాపై ప్రతీకార చర్యలు ఆరంభించిన డ్రాగన్ సర్కారు.. తొలుత యాంట్గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ ప్రపంచ దిగ్గజ ఇ-కామర్స్ సంస్థపై ఏకంగా 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అలీబాబా గ్రూప్ ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 18.3 బిలియన్ యువాన్ల(2.8బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.
అలీబాబాను పక్కన పెట్టిన చైనా
చైనా విడుదల చేసిన టెక్ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనబెట్టేసింది. ఈ పరిణామాల తర్వాత జాక్ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి. కానీ, కొద్ది వారాల తర్వాత వర్చువల్గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే చైనా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోయారు. అలీబాబాపై చైనా బ్యాంకింగ్ రెగ్యులేషన్ నిబంధనలు రుద్దింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పడిపోయింది. అటు జాక్మా కుబేరుల అగ్రస్థానాన్నీ కోల్పోవాల్సి రావడమేగాక, బాహ్య ప్రపంచానికి కన్పించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా నియంత్రణ పేరుతో జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది చైనా. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో(455.712 బిలియన్ యువాన్లు) దాదాపు 4 శాతానికి సమానం కావడం గమనార్హం.