ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేతలు.. అటు కేసీఆర్.. ఇటు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ తెలంగాణను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు అమిత్ షా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అలాంటప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించడంలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. సీఏఏతో ముస్లీంలకు ఎటువంటి నష్టంలేదని చట్టం మీద నమ్మకముందని న్యాయపరంగా ఎదుర్కొంటామని షబ్బీర్ అలీ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు డబ్బులు మోసుకుపోయే అలవాటు ఉన్నందునే పదే పదే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.
కేసీఆర్ భాష వల్లనే తెలంగాణ బద్నం అయిందని షబ్బీర్ అలీ అన్నారు. సాటి ప్రజాప్రతినిధులపై కేసీఆర్ అసభ్యంగా మాట్లాడినప్పుడు భాష మర్చిపోయారా అంటూ బీఆర్ఎస్ నేతలనుద్దేశించి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కొత్త కొర్పోరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్దికి కృషి చేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.