దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నబీఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ప్రజల నుంచి రుసుము తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ చేయాలని అన్నారు. అయితే దీన్ని మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పిదాలు జరుగుతుంటే సరిదిద్దుకోవడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
న్యాయపరమైన చిక్కులేమైనా ఎదురైతే వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం వద్ద తగిన యంత్రాంగం ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు.. దానిని ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుత్పాదక రంగంలో పెట్టుబడిపెట్టడంతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.