ఏపీ సీఎం జగన్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చేతులుకలుపుతున్నారని ఆంధ్రజ్యోతి ఆర్కే రాయడం కలకలం సృష్టిస్తోంది. వైఎస్ మరణం అనంతరం జగన్, సోనియా మధ్య చాలా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి వద్ద సోనియాగాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకొని తమ కుటుంబాన్ని విలన్లుగా చిత్రీకరిస్తున్నారని గతంలో సోనియాగాంధీ ఆవేదన చెందారట.
అయితే.. ఇప్పుడు జగన్ గురించి అన్నీ తెలిసి కూడా సోనియా ఆయనతోనే చేతులు కలపడానికి సిద్ధపడటం ఏంటని ఆర్కే అంటున్నారు. నేటి రాజకీయాలలో విలువలకు, నైతికతకు స్థానం లేదని అందరికీ తెలిసిన విషయమేగానీ మరి ఇంతగా ఉత్తర–దక్షిణ ధ్రువాలు కూడా కలసిపోతాయా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పార్టీల అధినేతలు తమ అధికారం కోసం, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారని ఆర్కే కామెంట్ చేశారు.