ఇవాళ్టి నుంచి బెజవాడ దుర్గగుడిలో ప్రత్యేక ఉత్సవాలు?

Chakravarthi Kalyan
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి మూడ్రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు  ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఉదయం 9 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలోని పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం 3 గంటలకు అమ్మ వారికి ప్రాతఃకాలార్చన జరిగింది. స్నపన కార్యక్రమం దృష్ట్యా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.  విఘ్నేశ్వరపూజ, పుణ్యాహ వచనం మండపారాధన, అగ్ని ప్రతిష్ఠాపన, సర్వ ప్రాయశ్చిత్త విధులు నిర్వహించారు. తర్వాత మూలవరులకు, ఉత్సవ మూర్తులకు, ఉపాలయాలలో పవిత్ర మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిత్య కైంకర్యాలను దేవస్థాన అర్చకులు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల కారణంగా బుధవారమే ఆలయంలో ఉదక శాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: