యాదాద్రి: భక్తులతో కిటకిట
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచి స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. కొండపైన అభివృద్ధి పనుల దృష్ట్యా వాహనాల అనుమతిని పోలీసులు నిరాకరించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన దేవాలయంగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తికానున్నాయని, భక్తులకు నాణ్యమైన సేవలు, మరింత మెరుగైన స్వామివారి దర్శనం కలగబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పలు విశిష్టతలతోపాటు తెలంగాణకే తలమానికంగా నిలవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, అందుకు తగ్గట్లుగా నిపుణులతో పనిచేయిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.