ఐటీ శాఖ పై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. ఐటీశాఖ పరిస్థితి విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైందని ఎద్దేవా చేశారు. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మాత్రం శూన్యమని ఆరోపించారు. కనీసం రివ్యూ మీటింగ్ కు హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు మా శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీ శాఖ మంత్రి బిజీగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు ఉందంటూ ఆరోపించారు. టీ, కాఫీలు తాగుతూ సలహాదారులు కాలం గడిపేస్తున్నారని వ్యాఖ్యానించారు. కంపెనీలు కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా బైబై జగన్ అంటున్నాయని చెప్పారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు అంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.