వ్యవసాయ ఉన్నతాధికారులు , జిల్లా జాయింట్ కలెక్టర్లతో వ్యవసాయ మంత్రి కన్నబాబు ఖరీఫ్ సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అంత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 2021 ఖరీఫ్ కోసం రాయితీ పై విత్తన సరఫరా , ఎరువులు ,పురుగు మందులు , వ్యవసాయ రుణాలు , వైఎస్సార్ పొలంబడి , వేరుశెనగ విత్తనాల పంపిణి అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
మరింత మంది కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డులు అందించి వారిని రైతు భరోసా పథకానికి అర్హులను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రాప్ ప్లానింగ్ , ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత , ప్రతికూలత , ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు మరింత దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు , వారి సూచనలు తదితర అంశాలపై అధికారులతో చర్చలు నిర్వహించాలని తెలిపారు. జులై 8 న వై ఎస్ ఆర్ జన్మదినం సందర్బముగా రైతు దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. అదేరోజు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు , హబ్ లను ప్రారంభిస్తున్నామని అన్నారు.