ఏపీ, తెలంగాణ మధ్య కోవిడ్ చికిత్స విషయంలో గందరగోళం నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్లను తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అడ్డుకుంటున్నారు. అనుమతి లేదని చెప్పి పోలీసులు నిలిపివేస్తున్నారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. అంబులెన్స్లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.