గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న 300 మంది ఉద్యోగుల ప్రాణాలను కాపాడినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 46,340 మంది ఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సంస్థ ఎండీ సజ్జనర్ సమీక్షించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన కాల్ హెల్త్ సంస్థ ప్రజంటేషన్ను ఎండీ సజ్జనర్ వీక్షించారు.
భవిష్యత్లో ఉద్యోగులు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి వారిని ఎండీ సజ్జనర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో రెండు నెలల్లో విడతల వారీగా దాదాపు 50 వేల మంది సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, అలాగే గత ఏడాది నవంబర్లో నిర్వహించిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో 46,340 సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించామని ఎండీ సజ్జనర్ తెలిపారు.