జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి పతకాలు సాధించిన క్రీడాకారులు సీఎం జగన్ను కలిసి.. తాము సాధించిన మెడల్స్ చూపించారు. నంద్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య ,మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో జూనియర్స్ టీమ్లో కాంస్య పతకం గెలిచిన బేబి రెడ్డి టీమ్, తాను సాధించిన పతకాలను సీఎం కు చూపించి ఆయనతో ఫోటో దిగారు.
జాతీయ స్ధాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు బేబి రెడ్డి తెలిపారు.
అలాగే ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్లో వెండి, కాంస్య పతకాలు సాధించిన పతకాలను షేక్ అర్షద్... సీఎంకు చూపించారు. అక్టోబర్లో ఫ్రాన్స్లో జరగనున్న ట్రాక్ వరల్డ్కప్లో పాల్గొంటున్నట్లు అర్షద్ వివరించారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఈ క్రీడాకారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.