కోటి విద్యలు కూటి కొరకే అంటారు.. ఎవరు ఎన్ని పనులు చేసినా అది పొట్ట తిప్పల కోసమే.. ఎంత ధనవంతుడైనా బంగారం మింగలేడు కదా అని వేదాంతం చెబుతుంటారు చాలా మంది. అదీ నిజమే.. ఎవరైనా బతకడం కోసం అన్నమో, రొట్టెలో.. ఇలా ప్రాంతాలను బట్టి ఏదో ఒక ఆహారం తీసుకుంటారు. అయితే.. రాళ్లు రప్పలు తిని బతికేవాళ్లు కూడా ఉంటారంటే నమ్మడం కష్టమే.
కానీ అదీ నిజమే.. ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి 40 సంవత్సరాలుగా ఇసుక తిని బతుకుతున్నాడట. రోజూ ఓ గుప్పెడు ఇసుక తినడం అతనికి అలవాటు. యూపీలోని అరంగాపూర్ వారి హరిలాల్ సక్సేనా పదేళ్ల కింద బతుకు దెరువు కోసం ఒడిశాకు వచ్చి ఉంటున్నాడు. గంజాం జిల్లాలో బేల్దారీ పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఆయన 40 ఏళ్లగా రోజూ పిడికెడు ఇసుక తింటున్నాడు. అలాగని భోజనం చేయడా అంటే.. భోజనం కూడా చేస్తాడు.. కానీ.. భోజనానికి ముందు గుప్పెడు ఇసుక తింటాడట. ఇంత కాలం ఇసుక తింటున్నా అతనికి ఆరోగ్య సమస్యలేమీ రాలేదట.