కరోనాతో మేలుకొన్న మహిళాలోకం.. ఉద్యోగాలు డబుల్!

P.Phanindra
కరోనా మహమ్మారి అందరికీ నష్టాలు, కష్టాలే మిగిల్చింది. కానీ మహిళలకు మాత్రం దీనివల్ల మేలే జరిగిందని ఓ సంస్థ సర్వేలో తేలింది. గతంలో మహిళలకు పెద్దగా ఉద్యోగాలు దొరికేవి కాదు. ముఖ్యంగా మానుఫాక్చరింగ్, ప్యాకేజింగ్ వంటి పరిశ్రమల్లో మహిళలకు చాలా చిన్న ఉద్యోగాలే అప్పగించేవారు. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, చాలామంది పురుష ఉద్యోగులు స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోవడం మహిళలకు కలిసొచ్చింది. కొత్త వారిని ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవడం కంటే ఆ పనిపై అవగాహన ఉన్న మహిళలకు ముఖ్యమైన ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి.

దీంతో సదరు కంపెనీల్లో గతంలో మగవాళ్లు అలంకరించిన పదవులు ఇప్పుడు మహిళల సొంతం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి కంపెనీల్లో పనిచేసే మహిళల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతంలో కేవలం 5 లేదా 6శాతం మాత్రమే మహిళా ఉద్యోగులున్న ఈ కంపెనీల్లో.. ప్రస్తుతం 12శాతంపైగా ఉద్యోగాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయి. వీరిలో మేనేజర్ల వంటి ఉన్నత పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ-కామర్స్ రంగంలో కూడా మహిళలు ముందడుగు వేశారు. ఈ వ్యాపారం చేసే కంపెనీలు వేర్‌హౌస్‌లలో మహిళలకు ఉద్యోగాలు చాలా తక్కువగా లభించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

‘ఇక్కడ బరువులు ఎత్తే అవసరం ఉండదు. ఇలాంటి పనులు మెషీన్‌లు చేసుకుంటాయి. కానీ వర్క్ ఫ్లో సాఫీగా సాగాలంటే మనుషులు కావాలి. ఈ పని మహిళలు కూడా చక్కగా చేసుకోగలరు’ అని ఓ ప్రముఖ సంస్థ పేర్కొంది. స్కానింగ్ స్పెషలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబిలింగ్ వంటి పనులన్నీ మహిళలు కూడా చేసుకుంటున్నారు. మొబైల్ తయారీ పరిశ్రమల్లో కూడా అసెంబ్లర్లు, స్టిక్కింగ్, ప్యాకింగ్, టెస్టింగ్, అసార్టింగ్ వంటి పనులన్నీ మహిళలే చేస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా మగవాళ్లంతా తిరిగొచ్చినా పనిలో ఉన్న మహిళల ఉద్యోగాలకు ఢోకా లేదనేది నిపుణుల మాట. అయితే నైట్ డ్యూటీల విషయంలో మాత్రం పురుషులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: