జోమాటో బాయ్‌పై అప్పుడు కంప్లైంట్.. ఇప్పుడు ఊరొదిలి వెళ్లిపోయిన మహిళ

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: జోమాటో డెలివరీ బాయ్ తనను దారుణంగా కొట్టాడని, ముక్కు పగలకొట్టాడంటూ ఓ మహిళ ఈ మధ్య తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో రక్తం కారుతున్న ముక్కుతో వీడియోలు పెట్టడమే కాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే తాజాగా ఆ మహిళ ఉన్నట్లుండి బెంగళూరు వదిలి వెళ్లిపోయింది. పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించారు.

హితేశ్ చంద్రనీ అనే మహిళ గతవారం జొమాటో బాయ్ కమల్రాజ్‌‌ తనపై దాడిచేసి గాయపరిచాడంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కమల్రాజ్‌ను జొమాటో ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేసింది. అయితే ఇటీవల కమల్రాజ్ కూడా హితేష చంద్రనీపై కౌంటర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. తాను లేట్‌గా డెలివరీ చేయడంతో హితేష తనను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా చెప్పుతో కూడా దాడి చేసిందని కమల్రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
   
ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు కేసు నడుస్తుండగానే హితేష ఇంటి అడ్రస్ సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో ఇప్పుడు ఆమె బెంగళూరు వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె ఇంటికెళ్లి చూసిన తమకు ఆమె అక్కడ లేరని, ఎవరూ తలుపు కూడా తీయలేదని స్థానిక పోలీస్ ఇన్స్‌పెక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు.
 
కాగా సోషల్ మీడియాలో ఈ కేసుపై నెటిజర్ల మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో హితేష తన సేఫ్టీ కోసమే బెంగళూరు వదిలి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె ఈ రోజు తమను మళ్లీ సంప్రదించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే కేసుపై మాట్లాడేందుకు మాత్రం పోలీసులు నిరాకరించారు. కేసు నడుస్తోందని దీనిపై ఇప్పుడు మాట్లాడడం సరికాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: