చంద్రుడి పై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2కు చివరి నిమిషంలో సమస్య వచ్చి పడింది. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో ల్యాండర్లో సమస్య తలెత్తి, ల్యాండర్ నుండి సంకేతాలు నిలిచిపోయాయి. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు ల్యాండర్ ప్రయాణం చాల సవ్యంగా సాగిపోయింది .. అనంతరం ఒక్కసారిగా సంకేతాల నిలిచిపోయాయి. విక్రమ్ ల్యాండర్ ప్రయాణం 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు సజావుగా సాగిందని, తర్వాతే సంకేతాలు నిలిచిపోయినట్టు ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. అయన మాట్లాడుతూ లోపాలకు గల కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు.
130 కోట్ల మంది భారతీయులు ఆశలని గర్వంగా మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో లోపం కారణంగా సంబంధాలు కోల్పోయింది. 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. దీనితో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచ నిరాశకు గురైంది. అంతకు ముందు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి 15 నిమిషాల ముందు తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది.
శనివారం తెల్లవారుజామున సరిగ్గా 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దింపేందుకు‘విక్రమ్’ ల్యాండర్కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. ఆ సమయంలో అంతా సజావుగానే సాగిపోతుంది అని శాస్త్రవేత్తలు .. 78 సెకెన్ల అనంతరం సంకేతాలు పంపుతూ ల్యాండర్ను ఉపరితలంపై దింపారు. ఈ సమయంలో ల్యాండర్లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు పనిచేయడం ఆరంభించి, దాని గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించేలా చేసాయి. అనంతరం ల్యాండర్ కొద్ది కొద్దిగా కిందకు దిగడం మొదలయింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వరకు ల్యాండర్ సజావుగా తన ప్రయాణాన్ని కొనసాగించింది ..కానీ , ఆ తరువాత సంకేతాలు రావడం నిలిచిపోయాయి. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని ఇస్రో ప్రకటించింది. దీనితో ఎన్నో కాసేపట్లో చంద్రుడిపై కాలుమోపబోతున్నాం అని ఆశలు పెట్టుకున్న 130 కోట్ల భారతీయుల కలలు నిరవేరలేదు. దీనితో కోల్పోయింది సిగ్నల్సే కానీ నమ్మకాన్ని మాత్రం కాదంటూ పలువురు ట్వీట్లు చేస్తూ ఇస్రోకు అండగా నిలుస్తున్నారు.