టెలికం రంగంలో ఎన్నో సంచలనాలకు కారణమైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో దూసుకుపోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దెబ్బకు ఇతర టెలికం పోటీదారుల్లో కలవరం పుట్టించింది. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోపే 50 శాతం మార్కెట్ ఆక్రమించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక జియో తాజాగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుతో వస్తోంది. మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన జియో ఫైబర్ సర్వీసుతో యూజర్లు మళ్లీ జియోకే జై కొడుతున్నారు.
జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే వెల్ కమ్ ఆఫర్ కింద 4K LED TV, 4K సెటప్ టాప్ బాక్స్ కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి ఇన్స్టాలేషన్ చార్జీలు ఉండవు.
రిలయన్స్ జియో ఫైబర్ కనెక్షన్లు ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ 1.5 కోట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తులు అందాయి. అలాగే ఇంట్లో నుంచే దేశంలోని అన్ని టెలికం నెట్ వర్క్లకు ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కాలింగ్ టారిఫ్ కూడా తక్కువ ధరకే అందిస్తోంది. జియో గిగాఫైబర్ సర్వీసు పొందాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. జియో రూటర్ కూడా ఉచితంగా పొందవచ్చు.
జియో ఫైబర్ డేటా ప్లాన్ల ధరలు ఇవే :
- జియో ఫైబర్ డేటా ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి.
- కస్టమర్లు నెలకు రూ.700తో డేటా ప్లాన్ తీసుకుంటే.. 100Mbps హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
- ప్రీమియం యూజర్లు రూ.10వేల డేటా ప్లాన్ తీసుకుంటే.. 1Gbps హైస్పీడ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు.