భారత దేశంలో ఇప్పుడు సెల్ ఫోన్..అందులోనూ స్మార్ట్ ఫోన్ వాడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇక మొబైల్ వినియోగదారుల్లో వాట్సాప్ ఉపయోగించని వారు ఉన్నారా అంటే అబ్బే లేరని చెబుతారు. సందేశాలు పంపించాలంటే ముఖ్య ఆధారం వాట్సాప్గా మారిపోయిన రోజులివి. పర్సనల్ మెస్సేజెస్, గ్రూప్ మెస్సేజెస్ ద్వారా క్షణాల్లో అవతలి వ్యక్తికి సందేశం పంపించడం వాట్సాప్ ప్రత్యేకత. కాకపోతే వాట్సప్ లో ఒక్కసారి మేజేస్, పిక్చర్, వీడియో సెండ్ చేశామంటే..అంతే సంగతులు...డిలీట్ చేయడానికి వీలు లేదు.
దీంతో చాలా మంది రాంగ్ మెసేజ్ లు పంపి ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. రోజుకో కొత్త ఫీచర్ ప్రవేశపెడుతూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ యూజర్లను సంపాదించుకున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. `మెస్సేజ్ రీకాల్` పేరుతో వ్యక్తిగతంగా గానీ, గ్రూప్లో గానీ పొరపాటున పంపిన మెసేజ్లను తొలగించే అవకాశాన్ని ఈ ఫీచర్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేవలం టెక్ట్స్ సందేశాలు మాత్రమే కాకుండా ఫొటోలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లను కూడా ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి.
గ్రూప్లో మెసేజ్లను మాత్రం ఎవరూ చదవకముందే రీకాల్ చేసుకోవాలి. డబ్ల్యూఏబీటా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఈ ఆప్షన్ కొద్దిమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో దశలవారీగా వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ వెల్లడించింది.