మహిళ టీ-20 ప్రపంచకప్ సెమీస్లో టీం ఇండియా.. నరాలు తెగే ఉత్కంఠలో గెలుపు..
గతేడాది జరిగిన పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మ్యాచ్లో ఆద్యంత ఉత్కంఠంగా జరగగా మ్యాచ్ టైం అయ్యింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో బౌండరీలు, సిక్సర్ల ఆధారంగా చివరకు ఇంగ్లండ్ను ప్రపంచకప్ విజేతగా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ మహిళ టీ 20 ప్రపంచకప్లో అదే ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. మహిళల టీ-20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ మహిళ జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది.
జంక్షన్ ఓవెల్ వేదికగా భారత్తో జరిగిన ఉత్కంఠపోరులో కివీస్ జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అమిలియా కెర్ర్ జట్టుకు విజయాన్ని అందించేందుకు ఆఖరి బంతి వరకూ పోరాడినా చివరకు భారత్ గెలిచి సగర్వంగా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 133 పరుగులు చేసింది. భారత ఇన్సింగ్స్లో మరోసారి యువకెరటం షపాలీ వర్మ కీలక పాత్ర పోషించారు. ఆమె 46 పరుగులు చేసి భారత్ను గెలిపించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి 4 పరుగులు స్వల్ప తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అయితే ఒకానొక దశలో న్యూజిలాండ్ గెలుస్తుందని కూడా అనిపించింది. అమిలియా కెర్ర్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో నాలుగు ఫోర్లు, రెండు పరుగులతో 18 పరుగులు చేసి జట్టును దాదాపు విజయానికి చేరువ చేసింది.
అయితే చివర్లో భారత బౌలర్లు చేసిన మ్యాజిక్తో న్యూజిలాండ్ నాలుగు పరుగులు తేడాలో విజయానికి దూరమైంది. కెర్ర్ తీవ్రంగా పోరాడినప్పటికీ న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీస్కు చేరుకుంది.