పదిహేనేళ్ల అనుభవం తర్వాత ఐసీసీ పీఠంపై జైషా

Suma Kallamadi

సోషల్ మీడియాలో ఇప్పుడు హోమ్ మంత్రి అమిత్ షా తనయుడు జైషా పేరు బాగా వినిపిస్తోంది. క్రికెటర్ అవుదామనుకున్న జైషా తన 35 ఏళ్ల వయసులో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ సంఘం అయిన ఐసీసీకి అధ్యక్షుడు అయ్యాడు. పదిహేనేళ్ల కాలంలో ఆయన ఎన్నో విజయాలు సాధించి ఆ తర్వాత అపార అనుభవంతో ఐసీసీ పగ్గాలు చేపట్టారు. జైషా జీవితంలో ఎంతో ఆసక్తిగా ఉంటుంది. 2009లో ఆయన గుజరాత్ క్రికెట్ సంఘానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఆ టైంలోనే గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నారు. అమిత్ షా ఓ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. దీంతో జైషాకు రాజకీయ అండదండలు దక్కాయి. అలా క్రికెట్ చరిత్రలో ఎదుగుతూ వచ్చాడు జైషా. 2013లో జైషా గుజరాత్ క్రికెట్ సంఘానికి జాయింట్ సెక్రటరీ అయ్యారు. ఇక ఆ తర్వాత 2015లో భారతీయ క్రికెట్ బోర్డు బీసీసీఐలో మెంబర్‌గా చేరారు.
బీసీసీఐలోకి వచ్చిన తర్వాత జైషా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2019లో బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికై ఆ తర్వాత 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడం విశేషం. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పదవీకాలం ముగిసిన వెంటనే రోజర్ బిన్నీ పగ్గాలు అందుకున్నారు. అయితే పెత్తనం అంతా జైషాదే. దీంతో ఆ రంగంలో బాగా పట్టు సాధించిన జైషా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ జట్లను శాసించే స్థాయికి చేరారు. ఆయన ఎదగడం వెనక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని అందరూ అనుకుంటారు. కానీ బీసీసీఐలో జైషా చేసిన సేవలు మరువలేనివని పలువురు అంటున్నారు.
క్రికెట్ చరిత్రలో బీసీసీఐ అనేది వేల కోట్ల ఆర్థిక నిధులున్న సంస్థ. ఇందులో ఉద్దండులు పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో సురేష్ కల్మాడీ, మరాఠా యోధుడు శరద్ పవార్, ఏన్ కేపీ సాల్వే, జగన్ మోహన్ దాల్మియా, అరుణ్ జైట్లీ వంటివారు ఐసీసీకి నేతృత్వం వహించిన వారిలో ఉన్నారు. జైషా ప్రస్థానం కూడా అలానే సాగింది. దశాబ్దన్నర కాలంలోనే ఆయన ఇసీసీకి చీఫ్ అయ్యారంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆయనకు నెటిజన్లు, క్రికెట్ అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

icc

సంబంధిత వార్తలు: