వరల్డ్ కప్: నరాలు తెగే ఉత్కంఠ... చివరి ఓవర్లో అద్భుతం చేసిన కెప్టెన్

VAMSI
మహిళల వరల్డ్ కప్ 2022 లో పాల్గొన్న 8 జట్లు ఈ సారి ఎలాగైనా టైటిల్ ను సాధించాలని ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా ఈ టోర్నీలో అదృష్టం ఉన్న ఒకే ఒక టీమ్ వెస్ట్ ఇండీస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటి వరకు వెస్ట్ ఇండీస్ మహిళలు ఆడిన 5 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లలో నెగ్గింది. అయితే గెలిచిన ఈ మూడు మ్యాచ్ లు కూడా ఏకపక్షం కాదు. అన్నీ ప్రత్యర్థి చేతికి వెళ్లిన మ్యాచ్ లు వెస్ట్ ఇండీస్ ఖాతాలో పడినవే. అందులో టోర్నీలో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ ను చివరి ఓవర్ లో 3 పరుగుల తేడాతో ఓడించి మొదటి విజయాన్ని అందుకుంది.

అదే విధంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ ను తన రెండవ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ఇండియా మరియు ఆస్ట్రేలియా చేతిలో ఓడినా, ఇప్పుడు బంగ్లాదేశ్ ను 3 పరుగుల తేడాతో ఓడించి మూడవ విజయంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా ఈ రోజు వెస్ట్ ఇండీస్ చావో రేవో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఢీకొంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా వెస్ట్ ఇండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి కేవలం 140 పరుగులు మాత్రం చేసింది. కీపర్ క్యాంప్ బెల్ 53 పరుగులతో ఆదుకోకుండా ఉంటే 100 లోపు ఆల్ ఔట్ అయి ఉండేది. ఇక ఈ పరుగులు చూసిన ఏ అభిమాని అయినా వెస్ట్ ఇండీస్ గెలుస్తుంది అని అనుకుంటారా ?

ఇక 140 పరుగుల లక్ష్యంతో బంగ్లా తన ఇన్నింగ్స్ ను ఆరంభించింది. విండీస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టలేదు. మొదటి ఓవర్ లోనే వికెట్ తీసి బలమైన సంకేతం ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. దీనితో వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లోకి వచ్చింది.  అలా ఆడుతూ వచ్చిన బంగ్లాదేశ్ కు చివరి ఓవర్ లో 8 పరుగులు చేస్తే గెలుపు దక్కుతుంది. ఈ సమయంలో బౌలింగ్ కి వచ్చింది కెప్టెన్ టేలర్. మొదటి బంతికి 2 పరుగులు, రెండవ బంతికి 1 పరుగు ఇచ్చినా మూడవ బంతికి త్రిష్ణ ను బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. వెస్ట్ ఇండీస్ మరో నరాలు తెగే ఉత్కంఠ పోరులో విజయ బావుటా ఎగరవేసింది.

ఈ విజయానికి ముఖ్య కారణం మాథ్యూస్ అనే చెప్పాలి. తన కోటా ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించి బంగ్లా ఓటమిని ఖాయం చేసింది. ఈ విజయంతో వెస్ట్ ఇండీస్ పాయింట్ల పట్టీకలో మూడవ స్థానంలో నిలిచింది. కానీ రన్ రేట్ తక్కువగా ఉండడం వీరికి ప్రతికూలంగా మారే విషయం. మిగిలిన రెండు మ్యాచ్ లలో 2 గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. లేదా ఒక్క మ్యాచ్ లో భారీ తేడాతో గెలిచిన అవకాశం ఉంటుంది. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ముందు జరిగే మ్యాచ్ క ఫలితాలను చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: