ఒకవైపు ఐపీఎల్.. కానీ ఇంటికి వచ్చేస్తున్న ఇండియన్ క్రికెటర్?
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడింది భారత జట్టు. అయితే ఇక ఈ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ కాస్తా కరోనా వైరస్ కారణంగా రద్దు అయింది. దీంతో ఇక ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు అందర్నీ కూడా ఇంగ్లండ్ నుంచి యూఏఈ తీసుకొస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇలా మొత్తం ఐపీఎల్ హడావిడి నెలకొన్న సమయంలో ఒక క్రికెటర్ మాత్రం ఇంటికి వస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా ఆరు నెలల తర్వాత ప్రస్తుతం ఇంటికి చేరుకున్నాడు ఆ తెలుగు క్రికెటర్. ప్రస్తుతం భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరున్న హనుమ విహారీ ఐపీఎల్ లో స్థానం సంపాదించుకోలేక పోయాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ బయలుదేరుతూ ఉంటే అటు తెలుగు ప్లేయర్ హనుమ విహారి మాత్రం స్వదేశానికి బయలుదేరాడు. ఆరు నెలల పాటు ఇంగ్లాండ్ లోనే ఉన్న విహారి 5 వ టెస్ట్ మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో ప్రస్తుతం భారత్ కు తిరిగి వచ్చేస్తున్నాడు. కాగా ఆరు నెలల పాటు ఇంగ్లండ్ లో ఎన్నో నేర్చుకున్నాను అంటూ హనుమ విహారి తెలిపాడు. అటు ఐపీఎల్ వేలంలో పాల్గొన్నప్పటికీ టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరున్న హనుమ విహారిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు అన్న విషయం తెలిసిందే.