ఒకప్పుడు స్టార్ క్రికెట్ ప్లేయర్స్..! ఇప్పుడు బస్ డ్రైవర్స్..
భారత్,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాల క్రికెటర్లు ఒకసారి జాతీయ జట్టుకు ఎంపికైతే వారి దశ తిరిగినట్లే. ఇక వారి లైఫ్ ఇలాంటి చీకూ చింత లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. కానీ మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు అక్కడ..మ్యాచ్ ఫీజులు కూడా చాలా తక్కువే. దీంతో ఉపాధి కోసం ఇతర పనులను కూడా చేస్తున్నారు. శ్రీలంక,జింబాబ్వే కు చెందిన మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదీప్, చింతక జయ సింఘ్ , జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవేయంగా ప్రస్తుతం మెల్ బోర్న్ లో స్థానికంగా ఉన్న ఒక క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూనే, మరోవైపు ట్రాన్స్ డెవ్ అనే ఫ్రెంచ్ కంపెనీకు చెందిన బస్సులు నడుపుతున్నారు.
ట్రాన్స్ డెవ్ అనే సంస్థ విభిన్న రంగాలకు చెందిన దాదాపు 1200 మంది డ్రైవర్ లను నియమించుకుంది. వారిలో ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఉన్నారు. క్రికెట్ ద్వారా తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని, తమ కుటుంబాలను పోషించడం కోసం బస్సు డ్రైవర్ లుగా చేరామని వారు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా రణదీప్ శ్రీలంక జట్టు తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు , 7 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 43 వికెట్లు తీశాడు. వాటిలో ఐదు వికెట్లు ప్రదర్శన ఒకసారి నమోదు చేశాడు. 4 వికెట్ల ప్రదర్శన మూడు సార్లు నమోదు చేశాడు. శ్రీ లంక జట్టు తరఫున చింతక జయ సింఘ్ 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో ప్రాధాన్యం వహించాడు. జింబాబ్వే కు చెందిన వాడింగ్టన్ ఎంవేయంగా 2005-06 సీజన్లో ఒక టెస్ట్,3 వన్డేల్లో జాతీయ జట్టుకు ఆడాడు.