వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే గాయం కారణంగా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తప్పుకొని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో అతని స్థానంలో శ్రద్ధుల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు మూడో వన్డే కు ముందు మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. అతని స్థానంలో డిల్లీ పేసర్ నవదీప్ సైనిని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అయితే ఆరంభం లో వికెట్ తీసి ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచడం లో చాహర్ సిద్ధహస్తుడు. దాంతో కీలకమైన మ్యాచ్ కు ముందు అతను దూరమవ్వడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ప్రస్తుతం వున్న ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల లో షమీనే అనుభవజ్ఞ బౌలర్ కావడంతో జట్టు ఎక్కువగా అతనిమీదనే ఆధారపడనుంది.
ఇక ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించగా రెండో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్ 1-1 తో సమం అయ్యింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో మ్యాచ్ ఆదివారం కటక్ లో జరుగనుంది. కాగా ఇరు జట్లు సిరీస్ పై కన్నేశాయి.