శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యలు అని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి 16వేల మంది కాదు.. ఆ సంఖ్య ఎంతంటే 16,108 మంది. హిందూ పురాణాల్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. అయితే శ్రీకృష్ణడుకు 8 మంది భార్యలే. వారి పేర్లు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ. వీరినే ఆయన వరించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యలు అని అందరూ అంటారు. మరి మిగిలిన 16,100 మంది ఎవరు? అనుకుంటున్నారా. దీనికి కూడా ఒక కథ ఉంది. 16,100 మంది శ్రీకృష్ణుడుకి ఎలా భార్యలు అయ్యారంటే..
శ్రీకృష్ణుడు నరకాసురున్ని వధిస్తాడు. నరకాసురుని చెరలో ఉన్న 16 వేల మంది యువ రాణులను విడిపించినప్పుడు వారు కృష్ణున్ని భర్తగా ఉండమని వేడుకుంటే అందుకు కృష్ణుడు అంగీకరించి వారిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా క్షకృష్ణుడికి 16,108 మంది భార్యలన్న మాట. అయితే శ్రీకృష్ణుడు తన అష్ట భార్యలను ఎలా వరించి చేసుకున్నాడో తెలుసుకుందాం..
రక్మిణి: విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి రుక్మిణిని శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన సందేశం పంపడంతో కృష్ణుడు అక్కడకు చేరుకుని, ఆమె అభీష్టం మేరకు ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
సత్యభామ: సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఈమెను భూదేవి అవతారంగా భావిస్తారు. అంతకు ముందు జన్మలో ఎలాగైనా సరే శ్రీమహావిష్ణువుకు భార్య కావాలని తీవ్రమైన తపస్సు చేస్తుంది. విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో.. తాను కృష్ణావతారంలో ఉన్నప్పుడు సత్యభామను పెళ్లాడతాడు.
జాంబవతి: సూర్యుడి వరంతో శమంతకమణి పొందిన సత్రాజిత్తును తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరితే అందుకు ఆయన అంగీకరించలేదు. ఇదే సమయంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ సింహం అతనిని చంపి, మణిని హరించింది. ఆ సింహాన్ని చంపిన జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు.
కాళింది: సూర్యుని కుమార్తె కాళింది. విష్ణువుని భర్తగా చేసుకోవడానికి ఘోరంగా తపస్సు చేస్తే మహావిష్ణువు మెచ్చి వరం ఇస్తాడు. ఆమె మరో జన్మలో జన్మించి శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న మహావిష్ణువును వివాహం చేసుకుంటుంది.
మిత్రవింద: శ్రీకృష్ణుడి మేనత్త కుమార్తె, అవంతీ రాజ కన్య మిత్రవిందను స్వయంవరంలో వరించి వివాహం చేసుకుంటాడు.
భద్ర: శ్రీకృష్ణుడి మరో మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి పుత్రిక భద్రను కూడా భార్యగా చేసుకుంటాడు.
నాగ్నజితి: కోసల దేశాధిపతి నాగ్నజిత్తుకు ఏనుగుల వంటి శక్తి కలిలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిలువరించిన వారికి తన కుమార్తె నాగ్నజితినిచ్చి వివాహం చేస్తానని ఆయన ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు ధరించి వాటిని బంధించాడు. దీంతో నాగ్నజితిని పరిణయమాడాడు.
లక్ష్మణ: మద్ర రాజ్యానికి చెందిన దేశాధిపతి కూతురు లాక్ష్మణిక. లాక్ష్మణిక స్వయంవరానికి కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, జరాసంధుడు వస్తారు. శ్రీకృష్ణడు లక్ష్యాన్ని ఛేదించగా.. లక్ష్మణను వివాహం చేసుకుంటాడు.