దుర్గమ్మ దర్శనానికి పొటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారు జాము నుంచి మహిళలు పెద్దఎత్తున ఆలయాలకు పొటెత్తారు. ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల కొంగు బంగారమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మహిళలు పెద్దఎత్తున కొండకు చేరుకున్నారు. కృష్ణా నదిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు... అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మాసం రెండవ శుక్రవారం కావడంతో... అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ కారణంగా అంతరాలయ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. 300, 100 రూపాయల టికెట్ తో పాటు ఉచిన దర్శనం కూడా కల్పిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తులు పొటెత్తారు.
కరోనా కారణంగా మహామండపం లిఫ్ట్ మార్గాన్ని అధికారులు మూసివేశారు. కేవలం ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కుంకుమ పూజలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పూలతో అంతరాలయాన్ని అలంకరించారు అధికారులు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ఖడ్గమాల పఠనంతో తొలి పూజ ప్రారంభించారు. సహస్ర కుంకుమార్చనతో అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజును వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదం అందించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు క్యూ లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. శానిటైజేషన చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: