కేసీఆర్ ఎత్తులు చూస్తే బాబు తప్పులే గుర్తొస్తున్నాయిగా..?
తెలంగాణలో బీజేపీ ప్రబల శక్తి కాకపోయినా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే ఆయన ఎక్కువగా బీజేపీపైనే ఫోకస్ పెడుతున్నారు. ఏకంగా ప్రధానినే నేరుగా ఢీకొంటున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా ముఖం చాటేశారు. ఇప్పుడు మోడీ తెలంగాణ ద్రోహి.. మోడీ తెలంగాణ ద్రోహి అని టీఆర్ఎస్ నాయకులతో చెప్పిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి. అయితే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే.. 2019కు ముందు చంద్రబాబు పన్నిన విఫల వ్యూహం గుర్తొస్తోంది.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు ఇదే వ్యూహం అనుసరించారు. మోడీ ఏపీకి ద్రోహం చేశాడని మొత్తుకున్నారు. మోడీ ఖబడ్డార్ అంటూ సవాళ్లు చేశారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి దీక్షలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నానా రచ్చ చేశారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కంటే ఎక్కువగా బీజేపీనే తిట్టారు.. కానీ ఆ వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. చంద్రబాబు మోడీ వ్యతిరేక వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి ఇప్పుడు అదే అట్టర్ ఫ్లాప్ వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నాడు.
చంద్రబాబుకు ఫలించని వ్యూహం.. కేసీఆర్కు మాత్రం ఫలిస్తుందా.. అందులోనూ కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని మోడీ వ్యతిరేక వ్యూహంతో కేసీఆర్ ఎదుర్కొంటాడా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కేసీఆర్.. చంద్రబాబు చేసిన తప్పే చేస్తున్నాడా అన్న వాదన మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.