హుజూరాబాద్‌ ఎన్నికలు ఆపేందుకు కేసీఆర్ అదిరే ప్లాన్ ...?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉపఎన్నిక.. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి చూపు ఈ ఎన్నికలపైనే ఉంది. అయితే అసలు ఈ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ కూడా రానేలేదు.. ఈ ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించనే లేదు.. కానీ అప్పుడే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సందడి మొదలైంది. అధికార పార్టీ జోరుగా చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ నియోజక వర్గంలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించేపనిలో పడింది. కౌశిక్‌ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నేతలను ఇప్పటికే ఆకర్షించింది. ఇక అన్ని వర్గాల ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా ప్లాన్ చేసుకుంటోంది.

అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా అప్పుడే ఎన్నికల ప్రకటన కూడా రాకుండానే జనంలోకి వెళ్లారు. పాదయాత్ర ప్రారంభించారు. పాపం.. మొన్ననే కాళ్లనొప్పులు, జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారనుకోండి. అది వేరే విషయం. పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఇప్పట్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగకుండా కేసీఆర్‌ ఓ అదిరే ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిళ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదేంటంటే.. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేలతో ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాటిని ఈసీ నిర్వహించడం లేదు. అయితే ఇప్పుడు క్రమంగా సీన్ మారుతోంది కదా.. కరోనా భయం తగ్గి అన్నీ ఓపెన్ అయ్యాయి కదా.. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది కదా.. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎలా ఉంటుందని ఈసీ ఆలోచించింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలంగాణ సర్కారును లిఖితపూర్వకంగా కోరింది.

దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమని బదులు పంపించారో తెలుసా.. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడే వద్దని లేఖ రాసిందట. మరి ఎమ్మెల్సీ ఎన్నికలే వద్దంటే.. ఇక ఈసీ హుజూరాబాద్ ఎన్నికలకు మాత్రం అనుమతి ఇస్తుందా.. హుజూరాబాద్ ఉపఎన్నికను మరింత వాయిదా వేయించేందుకే కేసీఆర్ సర్కారు ఇలాంటి సమాధానం ఈసీకి పంపిందా.. నిజం ఆ దేవుడికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: