హెరాల్డ్ సెటైర్ : డాక్టర్ రమేష్ మదర్ థెరెస్సాకు మారో రూపమా ? టిడిపి సర్టిఫికేట్
ప్రమాదం జరిగిన తర్వాత విచారణలో భాగంగా ఆసుపత్రికి చెందిన కొందరు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు వ్యక్తి రమేష్ మాత్రం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు. తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేశాడు. ఎప్పుడైతే రమేష్ అరెస్టు తప్పదని అర్ధమైపోయిందో అప్పటి నుండే ప్రభుత్వం నుండి కమ్మ సామాజికవర్గం నుండి ఎదురుదాడులు మొదలైపోయాయి. ఎందుకంటే చంద్రబాబుకు రమేష్ చాలా సన్నిహితుడు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గం ప్రముఖుల్లో రమేష్ కూడా ఒకడు. అందుకనే రమేష్ పై చర్యలను కమ్మ సామాజికవర్గం మీద దాడిగా గోల చేస్తున్నారు. రమేష్ అరెస్టు కాకుండా కాపాడుకోవాలనే పట్టుదలతో కమ్మ సామాజికవర్గం పెద్దలంతా ఏకమైనట్లే అనుమానంగా ఉంది.
బాధ్యత గలిగిన ప్రధాన ప్రతిపక్షహోదాలో ఉన్న చంద్రబాబు హాస్పిటల్ నడుపుతున్న రమేష్ ను విచారణకు సహకరించమని చెప్పాల్సిందిపోయి రివర్సులో మాట్లాడుతున్నాడు. ఇందులో భాగంగానే టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రమేష్ ఎంతో సేవాభావంతో కరోనా సెంటర్ నడుపుతున్నట్లు చెప్పాడు. కరోనా వచ్చిన తన మిత్రుడిని చేర్చుకోమని తాను ఫోన్ చేసినా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవద్దంటు హితవు చెప్పాడట. మీడియా సమావేశంలో సదరు మిత్రుడితో కూడా మాట్లాడించాడు. ఇక్కడ ఎంఎల్సీ చెప్పదలచుకున్నదేమంటే రమేష్ డబ్బుల కోసం సెంటర్ నడపటం లేదని కేవలం సేవాభావంతోనే చికిత్స అందిస్తున్నాడని. కానీ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో ఉన్న 31 మంది రోగుల్లో 27 మందికి అసలు కరోనాయే లేదని ఆసుపత్రి రికార్డుల ప్రకారమే తేలిందికదా. పైగా ఆసుపత్రిలో చేరిన వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కంప్యూటర్ల ద్వారా బయటపడిన విషయాన్ని ఎంఎల్సీ మరచిపోయినట్లున్నాడు.
కరోనా పేరుతో రోగుల నుండి రమేష్ ఎంత ఫీజులు వసూలు చేశాడని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఆసుపత్రిలో ఉన్న కంప్యూటర్లే ఆ విషయాన్ని బట్టబయలు చేశాయి. రాజేంద్రప్రసాద్ సిఫారసు చేసిన రోగిని చేర్చుకుంటే డబ్బులు వసూలు చేయటం సాధ్యం కాదని వద్దని చెప్పేసుండచ్చు. చనిపోయిన 11 మంది రోగులకు ప్రభుత్వం టెస్టులు చేసినపుడు కూడా 7 మందికి నెగిటివ్ వచ్చిన విషయం అబద్ధమా ? మొత్తం మీద రమేష్ ను కాపాడటానికి టిడిపి ఎంఎల్సీ ఎదురుదాడి చేసినట్లు అర్ధమైపోతోంది. డాక్టర్ ను డాక్టర్ లాగ చూడకుండా చంద్రబాబు దగ్గర నుండి క్రిందస్ధాయి కార్యకర్తల వరకు రమేష్ ను కమ్మ ప్రముఖునిగా చూడటం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఓపెన్ గా కమ్మ డాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న తమను జనాలు అసహ్యించుకుంటున్న విషయాన్ని టిడిపి నేతలు గుర్తిస్తున్నట్లు లేదు.