ఇండియా vs న్యూజిలాండ్: మొదటి వన్ డే లో ఆ ముగ్గురిపైనే గురి !

VAMSI
టీ 20 వరల్డ్ కప్ 2022 సెమిఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఓడిపోవడం ద్వారా అటు అభిమానుల్లో ఇటు ప్లేయర్స్ లో ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతిన్నది అని చెప్పాలి. ఈసారి వరల్డ్ కప్ ను ఎలాగైనా సాధించాలన్న కృతనిశ్చయంతో వేట కొనసాగించిన ఇండియా రెండు అడుగుల ముందు కూలబడింది. ఈ ఓటమిని మరిచిపోక ముందే న్యూజిలాండ్ గడ్డపైనే మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ను ఆడడానికి సన్నద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే టీ 20 సిరీస్ ను 1-0 తో గెలుచుకుని రెట్టించిన ఉత్సాహంతో వన్ డే సిరీస్ ను స్టార్ట్ చేయనుంది. రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో మొదటి వన్ డే జరగనుంది . వన్ డే టీం ను శిఖర్ ధావన్ నడిపించనున్నాడు.
ఇప్పటికే టీ సిరీస్ ను కోల్పోయిన కివీస్ ఎలాగైనా వన్ డే సిరీస్ ను గెలుచుకుని సమం చేయాలని సిద్ధంగా ఉంది. మరోవైపు వన్ డే సిరీస్ ను గెలిచి కివీస్ ను చావుదెబ్బ తీయాలని ఇండియా వెయిట్ చేస్తోంది. టీ 20 లలో ఛాన్స్  దక్కని వారికి ఇందులో ఆడే అవకాశం రావొచ్చు. ఇక అందరి చూపు సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ ల పైన ఉండనుంది. టీ 20 లలో అద్భుతంగా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ వన్ డే లలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తాడా లేదా అన్నది చూడడానికి అటు అభిమానులు మరియు టీం యాజమాన్యం ఎంతగానో ఎదురుచూస్తోంది.
కేరళ సూపర్ స్టార్ సంజు శాంసన్ కు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.. సాలిడ్ బ్యాటింగ్ తో దీర్ఘకాలం జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది అతని ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పైన కూడా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉన్నందున ఆల్ రౌండర్ గా ఎలా ఆడుతాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: