స్టార్ క్రీడాకారులకు కరోనా సోకడానికి కారణమదేనా ?

Kothuru Ram Kumar

టెన్నిస్‌లో కరోనా కలవరం కొనసాగుతోంది. సెర్బియా టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే దిమిత్రోవ్‌ (బల్గేరియా), కొరిచ్‌ (క్రొయేషియా) ఆ మహమ్మారి చేతికి చిక్కగా.. తాజాగా మంగళవారం జకోవిచ్‌తో పాటు విక్టర్‌ ట్రయోకీ (సెర్బియా)కి వైరస్‌ సోకినట్లు తేలింది. జకో భార్య జెలీనా, గర్భవతైన విక్టర్‌ భార్య కూడా వైరస్‌ బాధితులుగా మారారు.

 

నాకు, నా భార్యకు పాజిటివ్‌ వచ్చింది. నా పిల్లలకు నెగెటివ్‌గా తేలింది. ఆగ్నేయ ఐరోపాలోని ఆటగాళ్లను పోటీతో కూడిన టెన్నిస్‌ ఆడేలా చేయడంతో పాటు వచ్చిన విరాళాలను అవసరాల్లో ఉన్నవాళ్లకు అందించడం కోసమే టోర్నీ నిర్వహించాం. వైరస్‌ బలహీనపడిందని నమ్మి పోటీలు జరిపాం. కానీ దురదృష్టవశాత్తూ ఆ వైరస్‌ ఉనికి అలాగే ఉంది. దానితో కలిసి జీవించడం ఎలా అనే విషయాన్ని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నామనే వాస్తవం బోధపడింది. వైరస్‌ సోకిన వాళ్లను క్షమాపణలు కోరుతున్నా’’ అని జకో ఓ ప్రకటనలో తెలిపాడు. మరోవైపు ఇద్దరు కోచ్‌లు కూడా వైరస్‌ బారిన పడ్డట్లు సమాచారం.

 

 అసలేం జరిగింది..? 

 

వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సెర్బియాతో సహా చుట్టు పక్కల దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు దాదాపుగా ఎత్తివేయడంతో క్రీడా టోర్నీల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ ఛారిటీ టోర్నీ నిర్వహణకు జకోవిచ్‌ సిద్ధమయ్యాడు. తొలి అంచె పోటీలు ఈ నెల 13, 14వ తేదీల్లో సెర్బియాలో జరిగాయి. రెండో అంచె పోటీలు క్రొయేషియాలో గత శనివారం మొదలయ్యాయి. అయితే ఆ టూర్‌లో పాల్గొన్న దిమిత్రోవ్‌ కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల రెండో అంచె పోటీలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. టోర్నీలో ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతుండడంతో వచ్చే 27, 28 తేదీల్లో మాంటెనిగ్రోలో జరగాల్సిన మూడో అంచె పోటీలను కూడా రద్దు చేశారు. ఈ టోర్నీల్లో పాల్గొన్న స్టార్‌ ఆటగాళ్లు జ్వెరెవ్‌, సిలిచ్‌, రుబ్లెవ్‌లకు నెగెటివ్‌ రావడం కాస్త ఉమశమనం కలిగించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: